ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, March 10, 2013

నన్ను మనిషిగా ఉంచుతున్నది



ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. సహజంగా కొడుకుని చూసి ఎవరైనా గర్వపడతారు, కానీ నేను మాత్రం మా నాన్నగారిని చూసి గర్వపడతాను. ఈ సృష్టిలో  కన్నతండ్రిని ప్రేమించని వాళ్ళు ఉండరు. (ఎక్కడో నాలాంటి దరిద్రులను తప్ప). కానీ ఇక్కడ నేను నా తండ్రిని, నా తండ్రిగా కంటే కూడా ఒక మనిషిగా ఎక్కువగా ఇష్టపడతాను. చాలా మంది కొడుకులలాగే నేను కూడా, ఆయనతో గొడవపడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడడం మానివేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని ఎలా ఉన్నా ఆయనలో ఉన్న మనిషిని నేను ఎక్కువ గౌరవిస్తాను. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు పుట్టుకతో ప్రతీవాడూ శూద్రుడే, ఆ తరువాత మనం పాటించే ఖర్మలను బట్టి మన వర్ణం ఆధారపడి ఉంటుందనేది నేను మా నాన్న గారిని చూసి తెలుసుకున్నాను. ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించినా, ఒక్క వైశ్య లక్షణాలు తప్ప మిగిలిన లక్షణాలు అన్నీ నేను ఆయనలో చూసాను. ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు నేను ఆయనలో చూసాను. విద్యనేర్పే గురువు విధ్యార్థుల భాధ్యత ఎలా తీసుకోవాలో ఆయన అలా తీసుకునేవారు. ఒక గురువుగా ఎంతమందికి ఆయన సాయం చేసారో నాకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలిసింది. సహజంగా నా స్నేహితులు నాతో మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ నేను ఎవరినో తెలియకుండా మా నాన్నగారి గురించి కొంతమంది నాకు చెపుతున్నప్పుడు, నాకు నా మీదే అసహ్యం వేసేది. (ఎందుకనో తెలియదు కానీ, నేనెప్పుడూ మా నాన్నగారి గురించి ఎవరికీ చెప్పేను). ఆ తరువాత వాళ్ళకు నేనెవరో తెలిసినప్పుడు వాళ్ళు నాకు దణ్ణం పెట్టేవారు, మీ నాన్నగారి దయవలన నేను ఇంతవాడిని అయ్యాను అని. విద్య చెప్పినప్పుడు ఆయనలో నేను బ్రాహ్మణ లక్షణాలను చూసాను, అలాగే దానం చేసినప్పుడు ఆయనలో క్షత్రియ లక్షణాలను చూసాను, తను చేస్తున్న ఉద్యోగంలో ఆయన పడే కష్టం చూసినప్పుడు నాకు ఆయనలో ఒక శూద్రుడిని చూసాను. నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నేను ఆయనలో ఎక్కడా వైశ్య లక్షణాలు చూడలేదు. ఆయనలో ఎక్కడా వ్యాపారం మీద మక్కువ నేను గమనించలేదు. ఆయన ఎన్నో ఫాక్టరీలకు చార్టర్డ్ ఇంజనీర్, కానీ ఆయన ఎన్నడూ దానిని వ్యాపారంగా చెయ్యలేదు. అలా చేసి ఉంటే ఈ రోజు నాకు కోట్లు ఇచ్చివుండేవారేమో, దానిని నేను ఆనందంగా ఖర్చుపెట్టుకుంటూ తిరిగేవాడినేమో, కానీ ఇంత గర్వంగా ఈయన మా నాన్నగారు చెప్పుకొనేవాడిని కాదు. నేను అప్పులపాలయినప్పుడు, ఆయన ఆస్తి మొత్తం అమ్మివేసి అప్పులు తీర్చివేసారు. అందులో మా అమ్మకు, అక్కలకు ఇవ్వవలసినది ప్రక్కన పెట్టి, ఆయనది మొత్తం అమ్మివేసి, నన్ను మళ్ళీ ఉద్యోగం చేసుకొని బ్రతకమని సలహా ఇచ్చారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయనది కాని ఆస్తి మీద ఆయన హక్కుని తీసుకోలేదు. నేను అందరినీ కోల్పోయి, ఏ ఉద్యోగమూ చెయ్యకుండా పిచ్చిలో పడి, ఖాళీగా తిరుగుతున్నప్పుడు, నాలుగు సంవత్సరాల పాటు నెలకు పాతికవేలు చొప్పున పంపిచారు తప్పితే ఎప్పుడూ నన్ను తిట్టలేదు. ఈ రోజు దాకా నువ్వు నీ జీవితం చూసుకో అని చెప్పలేదు, తప్పు చేసావు కాబట్టి వేచి ఉండు అన్నారు తప్పితే, ఎప్పుడూ నాకు వేరే జీవితం గురించి సలహా ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం నాకు నడుం నొప్పి మళ్ళీ వస్తోంది అని చెప్పినప్పుడు, కొత్త కారు కొనుక్కో డబ్బులు పంపిస్తాను అని రోజూ తిట్టేవారు, ఒద్దని నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటానని చెప్పినప్పుడు రెండు లక్షలు పంపించారు. ఇప్పటికీ మా అమ్మ రోజూ ఫోన్ చేసి సెకండ్ హ్యాండ్ కారు వద్దు, అమ్మేయి, భాజీ పంపిస్తారు, కొత్తది కొనుక్కో అని తిడుతోంది. వాళ్ళకు నామీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన రిటైర్ అయ్యాకా పుట్టపర్తి వెళ్ళిపోయి అక్కడ స్కూలులో టీచర్‌గా సర్వీస్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు ఒక్కరే కాదు, అక్కడ ఉన్న టీచర్స్‌లో ముప్పాతిక వంతు మంది ఫ్రీగా టీచ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరికీ కూడా బయట ఉద్యోగం చేస్తే, ఏ కార్పొరేట్ కాలేజీ వాళ్ళైనా, నెలకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జీతం ఇస్తారు. అటువంటి చోట మా నాన్న గారు హాయిగా సేవ చేసుకుంటున్నారు. నా ఈ అహంకారానికి కారణం మా నాన్నగారు. కానీ నేను వేసిన ఒక తప్పటడుగు ఈ రోజు వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టింది. అందుకు నేను చాలా భాధపడుతున్నాను. కానీ ఈ రోజుకూ ఆయన నేను వేసింది తప్పడడుగు అని అనరు. నేను నాకు సంబంధించిన ఏ విషయమూ ఆయనకూ చెప్పను. నా ప్రోబ్లం ఏదో నేనే చూసుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగారు, కాదు తిట్టారు, ఉన్నవాడివి ఒక్కడివి, వాళ్ళను నీ దగ్గరకు తీసుకువచ్చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు అక్కడ చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, ఇక్కడకు వచ్చినదగ్గరనుండీ, నా స్థితి చూసి వాళ్ళు భాధపడాలి అనేది నాకు తెలుసు. అందుకని నేను వాళ్ళను ఇక్కడకు రమ్మని అడగను. ఒకవేళ వాళ్ళు ఇక్కడకు వచ్చినా నా రూముకు తీసుకురాను, మా మేనకోడలి ఇంటి దగ్గర ఉండమంటాను. నన్ను ఒక్కడిని చూస్తే వాళ్ళకు భాధకలుగుతుందని నా భాధ. మా నాన్న గారికి స్టూడెంట్స్ కాళ్ళకు దణ్ణం పెట్టడం చూసాను, అందులో కొంతమంది, దరిదాపులదాకా ఆయన వయసువాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేటుగా డిప్లొమా చేసేవాళ్ళు కొంతమంది ఆయన వయసువాళ్ళు ఆయన దగ్గరకొచ్చి నేర్చుకొనేవారు. వాళ్ళ డిప్లొమా చేతికొచ్చాకా వాళ్ళు వచ్చి ఈయన కాళ్ళకు దణ్ణం పెట్టబోయేవారు. కానీ, ఆయనతో పాటు పనిచేసిన లెక్చరర్స్ కూడా ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టడం నేను కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసాను. మా నాన్నగారు అప్పటికి రిటైర్ అయ్యిపోయారు. మా మేనల్లుడికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అంటే తిరుపతి వెళ్ళాము. అప్పుడు మా నాన్నగారు తన దగ్గర లెక్చరర్‌గా చేసిన ఒకాయనకు ఫోన్ చేసి వీలుంటే రమ్మని చెప్పారు. ఆయన సాయంత్రం భార్యతో కలిసి వచ్చి, వెళ్ళిపోతూ కాళ్ళకు నమస్కారం చేసివెళ్ళారు. నాకు చాలా ఆశ్చ్రర్యం వేసింది. నా తండ్రి ఇంత ఉన్నతుడా అని అనిపించింది. ఇప్పటికీ హిందూపూర్ పాలిటెక్నిక్‌లో మా నాన్నగారు ప్రిన్సిపాల్‌గా చేసినప్పటి బ్యాచెస్ అమ్మాయిలు పుట్టపర్తి వచ్చి మా నాన్నగారిని కలిసివెళుతుంటారంట. వాళ్ళు కూడా మా నాన్నగారిని మేము పిలిచినట్టే భాజీ అంటారంట.