ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, February 27, 2015

గత రెండు రోజులుగా, ఆంధ్రా ప్రాంత ఆర్థిక స్థితి మీద ఎగతాళిగా మాట్లాడుతున్న తెలంగాణా నాయకుల మాటలు ఏమన్నా ఆంధ్రా ప్రాంత నాయకులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు వినిపిస్తున్నాయా? లేక వినిపించకుండా, చెవుల్లో గుడ్డలు కుక్కేసుకున్నారా? 1956లోనే మాది మిగులు బడ్జెట్ అని వాళ్ళు చెపుతున్న మాటలు తెలంగాణా సోదరుల్లాగే ఆంధ్రా నాయకులు కూడా నమ్ముతున్నారా? రాష్ట్ర సంపదనంతా తీసుకొని వచ్చి ఒకే ప్రాంతంలో గుమ్మరించి, ఈ రోజు ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. హైదరాబాద్ ఆదాయం లేకపోతే తెలంగాణా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి, ఆంధ్రులు ఇన్ని అవమానాలు పడే పరిస్థితి తీసుకువచ్చింది ఆంధ్రా ప్రాంత నాయకులే. ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. రాజధాని అంటూ, దాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప, మిగిలిన జిల్లాల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా అదే తప్పు చెయ్యడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు.
లోటు బడ్జెట్ అంటూ ఒక ప్రక్క బీద అరుపులు అరుస్తూ, ఎవడి సొమ్మని పిఆర్‌సి అనౌన్స్ చేసారో తెలియడం లేదు. ఇష్టం వచ్చినట్టు చంద్రన్న కానుకలు అంటూ కోట్లు విసురుతూ, ఖజానాను ఖాళీ చేస్తూ ఇప్పుడు కేంద్రం మీద పడుతున్నారు. అప్పు చేసి సోకులు చెయ్యడం ఏమీటో, తీర్చేది తనూ, తన పార్టీ కాదనా ఆయన ధైర్యం. కేంద్రం మీద తిరగబడడానికి ఎందుకు వెనుకాడుతున్నారో ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. స్పెషల్ స్టాటస్ అనేది రాదని అందరికీ తెలుసు, వేరే విధంగా అయినా సొమ్ములు రాబట్టాలి కదా. ఎందుకు వెనుకాడుతున్నారు? లక్ష కోట్ల రాజధాని అని అందరూ విమర్శిస్తారని అనుమానమా? మనకంటే ముందు ఏర్పాటయిన మూడు కొత్త రాష్ట్రాలు నెమ్మదిగా రాజధానిని కట్టుకుంటున్నాయి కానీ, రాత్రికి రాత్రే రాజధాని కట్టాలి అని ఉరకలేదు. వాళ్ళు ముందు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. మన నాయకులు మాత్రం రాజధాని పేరు చెప్పి, రియల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మిగిలిపోయేటట్టుంది.
ఐదారు సంవత్సరాల సమయం పట్టే ఎంఎన్‌సి ల గురించే ఆలోచిస్తున్నారు తప్ప, ఆరేడు నెలలలో తయారయ్యి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల గురించి ఆలోచన కూడా చెయ్యడం లేదు. ఎంత సేపూ కేంద్రం స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదనే సాకు చూపిస్తున్నారు కానీ, రాష్ట్రం తరపున ఒక్క ప్యాకేజీ ప్రకటించడం లేదు. ప్రక్క రాష్ట్రంలో మూత పడిన పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం ఒక్కటీ చెయ్యడం లేదు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదా? ఎవడన్నా వ్యాపారం చెయ్యడానికి అప్పు గురించి వెళితే, అప్పిచ్చేవాడు, వీడు నిజంగా వ్యాపారానికే వాడతాడా, లేక షోకుల కోసం వాడతాడా అని చూస్తాడు. ఇప్పుడు మన రాష్ట్రం మీద కూడా అదే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా.
ఇదే పోస్టుని నేను జగన్ ముఖ్యమంత్రి అయితే పెట్టేవాడిని కాదు, కారణం అతని మీద నాకు నమ్మకం లేకే, నేను చంద్రబాబుకు ఓటు వేసాను.

Saturday, February 21, 2015

పాపం రంగరాయ మెడికల్ కాలేజీ



పూర్వ విధ్యార్ధులు ఎవరైనా తమకు చదువు నేర్పిన విద్యాలయాన్ని దేవాలయంలా చూసుకుంటారు. అందులో

పనిచేసే ఉపాధ్యాయులను వ్యతిరేకించే వారుంటారేమో కానీ, ఆ దేవాలయాన్ని వ్యతిరేకించరు. కొంత మంది పూర్వ

విధ్యార్థులైతే, వాటికి లక్షల లక్షల సొమ్ముని విరాళంగా ఇస్తారు.


కానీ మా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ దరిద్రం ఏమిటో, ఆ పూర్వ విధ్యార్థులే (శవాలకు వైద్యం చేసి


సంపాదించింది చాలలేదనుకుంటా) దానికున్న స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకా పూర్తి


వివరాలు అందాలి. నిజాయితీపరుడు, మా కాకినాడ మెడికల్ కాలేజీ పూర్వ విధ్యార్థి అయిన మన హెల్త్ మినిష్టర్


గారు, అది నిజమైతే ఏమి చేస్తారో చూడాలి.

నేటి భారతం.



నేను ఒక అరగంట క్రితం ఇంటికి వచ్చే సరికి ఈటీవి 2 లో వక్తలు మాట్లాడుతున్నారు. జపాన్‌లో అలా ఉంటారు, ఇలా ఉంటారు అని. బాగానే ఉంది. దానిని ఎవరూ కాదనరు. అక్కడ వర్క్ కల్చర్ కూడా వేరేగా ఉంటుంది అనేది, గొడ్లు కాసుకునే వాడికి కూడా తెలుసు. జపాన్ అయినా, సింగపూర్ అయినా అలా ఉండడానికి కారణం రాజకీయ అవినీతిని అక్కడ ఉపేక్షించకపోవడం.


దానిని ప్రక్కన పెట్టినా, ఇప్పుడు మన రాష్టంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఎన్ని చదువును చెప్పేవి ఉన్నాయి? ఆ కాలేజీలకు ఎవరు అనుమతిచ్చారు? అటువంటి కాలేజీల నుండి వచ్చినవారి దగ్గర నుండి నువ్వు ఏమి పొందగలవు? ఏదో ఎంసెట్‌లో సీట్ వచ్చిన వాడే మేధావి అని అనుకోవడం పొరపాటు. లక్ష ర్యాంక్ వచ్చిన వాడు కూడా మంచి ఉపాధ్యాయులు ఉంటే, ఒక మంచి ఇంజనీర్ కాగలడు. కానీ జరుగుతున్నది ఏమిటి? వీళ్ళు జపాన్‌లు, సింగపూర్‌లు వెళ్ళక్కరలేదు. మన దగ్గర ఉన్న పారిశ్రామిక వేత్తలను అడిగినా చెపుతారు, వచ్చేదంతా స్క్రాప్ అని. దానికి కారణం ఈ నాయకులు కాదా? అలాగే పరిశ్రమ అధిపతులు కూడా ఓహో జపాన్ అంటున్నారు. నిజమే ఓహో జపానే. కానీ అక్కడ పరిశ్రమల అధిపతులు వీళ్ళల్లాగా కాపీ కొట్టరు, రీసెర్చ్ మీద ఖర్చుపెడతారు. శ్రామికుడి శ్రమ శక్తిని దోచుకోరు.



పైగా వాళ్ళు మాటల్లో మనలో ప్రతీ దానినీ వ్యతిరేకించే భావన పోవాలని సుద్దులు కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఎటువంటి విత్తనాలు వేసినా మనం మాట్లాడకూడదన్నమాట. చెప్పేవాడికి వినే వాడు లోకువ అని ఊరికే అనలేదు. ముందు విద్యా వ్యవస్థని ప్రక్షాళన కావించాలి. ఆ ధైర్యం మన ప్రభుత్వాలకు ఉందా? ఎవడన్నా, పక్కోడిని చూసి అలా ఎదగడానికి చూస్తాడు కానీ, పక్కోడు గొప్ప, మనం ఉట్టి సోంబేరిలం అని అనడు. అధికారం ఉంది కదా, అలా ఎదగడానికి ప్రణాళికలు తయారుచెయ్యండి, ఇక్కడ తెలివితేటలకు లోటు లేదు, దరిద్రం అంతా, మీ ధనాపేక్ష ఒక్కటే

నేటి భారతీయుడు



నా తరం వాళ్ళు, నా ముందటి వాళ్ళు గారడీ వాళ్ళను చూసే ఉంటారు (నేను వినడమే తప్ప చూడలేదు). ఆ గారడీ చేసే వ్యక్తి ప్రక్కన అతని కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు డప్పులు కొడుతూ అతనిని ఉత్సాహపరుస్తుంటారు. ఉన్నట్టుండి తేళ్ళు, పాములు వచ్చేస్తాయంట. అలాగే డబ్బులు వచ్చెసేవంట. దానినే కనికట్టు విద్య అంటారు, వాళ్ళను మోళీగాళ్ళంటారనుకుంటా.


అలాగే ప్రపంచ మెజీషియన్స్‌కి ఇప్పటికీ తెలియని, అర్థం కాని విద్య "ఇండీయన్ రోప్ ట్రిక్". మెజీషియన్ ఒక త్రాడుని ఆకాశంలోకి విసిరి, దానిని పట్టుకొని పైకెక్కి, కనిపించకుండా పోయేవాడంట. అందరూ అలా చూస్తుండగానే, వాళ్ళ మధ్యలో నుండి ఆ పైకి వెళ్ళిన వచ్చి పలకరించేవాడంట.


ఇప్పుడు మన దగ్గర ఆ మోళీ గాళ్ళు మన రాజకీయ నాయకులు. అప్పుడు ప్రక్కన డప్పు కొట్టే వాళ్ళు (అప్పుడంటే ఒక చిన్న సమూహానే మాయలో పడేసేవారు) ఇప్పుడు టీవీలలో మేధావులుగా, టాక్ షోలలో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకు వాళ్ళ పార్టీలు, నాయకులు ఏది చెపితే అదే వాస్తవం అనిపిస్తుంది (?). వాళ్ళ నాయకుడు తీసుకున్న ఏ నిర్ణయానైనా, టీవీలలో అందంగా ఎకానమీని ఉటంకిస్తూ ప్రజలను కనికట్టుతో కట్టేస్తారు. మన కళ్ళ ముందు సింగపూర్ సిటీలను సృష్టిస్తారు. అది నిజమని అనుకొని, మనం ఇప్పుడు కావలసిన గంజిని మరచిపోతాము.


ఒకరి మీద ఒకరిని రెచ్చగొడతారు. అడవులు నరికి పరిశ్రమలు స్థాపించాలి అంటారు. పారిశ్రామికవేత్తలకు తప్ప, రైతుకు తన పొలం మీద తనుకు హక్కు లేకుండా చేస్తారు. ఒక ప్రక్క గంగ ప్రక్షాళన అంటారు, ఇంకో ప్రక్క కొన్ని పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు అంటారు. విజనరీని అంటారు, మనకు విజన్ లేకుండా చేస్తారు. చాయ్ వాలాను అంటారు, మనకు చాయ్ లేకుండా చేస్తారు. దాహం అంటే హిమాలయాలలో పుట్టిన గంగ నీళ్ళు అమ్ముతున్నాం అంటారు. వైజ్ఞానికంగా ఎదగాలి అంటారు, విజ్ఞానాన్ని మాత్రం విదేశాల నుండీ కొంటాం అంటారు. సరస్వతి పుట్టిన దేశం అంటారు, సరస్వతిని అంగడి సరుకుని చేస్తారు. ఉద్యోగులకు లొంగుతారు, రైతులను అమ్ముతారు.


అమ్మా, నాన్నలకు దణ్ణం పెట్టని వాళ్ళు వీళ్ళ కాళ్ళకు మొక్కుతారు. అమ్మా, నాన్నల ఫొటోలు కనపడవు కానీ, నాయకుల ఫొటోలు గుండెల మీద వ్రేలాడుతుంటాయి.. వీళ్ళ బానిసత్వాన్ని మనకు అలవాటు చేసేస్తారు. మనం లొంగకపోతే పిచ్చి కుక్కల్లా అరుస్తారు.



ఇది నేటి భారతం.