నాకు బాగా గుర్తు, నేను ఏడో తరగతిలో ఉండగా, సరిగ్గా చదవడం లేదని, అల్లరి బాగా చేస్తున్నానని
మా నాన్నగారు నన్ను, కుట్టు మిషన్ బెల్ట్తో కొట్టారు. మోకాలి మీద ఆ మచ్చ, నాకు
గుర్తున్నంతవరకు డిప్లొమా చదివేటప్పుడు కూడా ఉండేది. ఆ తరువాత, పదో తరగతిలో కాకినాడ
నుండి విజయవాడలో ఉన్న బుచ్చయ్య మాష్టార్ దగ్గరకు పంపారు. అక్కడ నుండి ఇరవై రోజుల్లో
బెంగపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్నగారికి కొట్టీ, కొట్టీ విసుగొచ్చి, వీడికి ఇక చదువు
రాదు అని వదిలేసారు. ఏదో అత్తెసరు మార్కులతో డిప్లొమా పూర్తి అయ్యిందనిపించాను.
నాకు చదువు సరిగ్గా రాకపోవడం, ఒక అజ్ఞానిలా మిగిలిపోవడం వలన చచ్చినవాడూ, చంపబడ్డ
వాడు హిందువా, ముసల్మానా, క్రిస్టియన్నా అనే భేధాన్ని గుర్తించే శక్తి నాకు రాలేదు. ఎవడు,
చచ్చినా వాడి మీద జాలితో, చచ్చిన వాడి బంధువులు తిరగబడి చంపితే బాగుండును అనుకునే
రాక్షస/ జంతు ప్రవృత్తి అలా ఉండిపోయింది, చదువు లేదు కదా.
అలాగే హలాల్ చేసిన మాంసం తినడం మానివేసినప్పుడు, ముస్లిం సోదరులను భోజనానికి
పిలిస్తే, రొయ్యలు కాకినాడ నుండి తెప్పించి వండించే హ్రస్వ దృష్టితో ఉండిపోయాను.
ఇతర మతాల దేవుళ్ళను దిగజార్చి మాట్లాడే శక్తి నాకు రాలేదు. ఇతర మతాల వారి అలవాట్లను
కించపరచే ఆలోచనలు రాలేదు. ప్రక్కవాడు అసహ్యించుకునే గన్నవరం సీమ పంది మాంసాన్ని,
అతను బాధపడేటట్టు బహిరంగంగా తినడం రాలేదు. ఆస్తికుడు మూర్ఖుడు అంటూ, వాడిని
మారుస్తానని చెప్పి, ద్వేషాన్ని చిమ్మడం రాలేదు. కన్నతల్లి, తండ్రులు, చదువు చెప్పిన గురువుల
తరువాత స్థానాన్ని పొందే, నేను నమ్మే నా దేవుళ్ళ విగ్రహాల మీద, మూత్రం పోస్తాను అన్నవాడిని
హేతువాది, మేధావి అని గుర్తించే జ్ఞానం రాలేదు.
వీటన్నిటి వలన నాకు ఏ అవార్డూ రాలేదూ, ఇప్పుడు వాటిని తిరిగిచ్చి,
మేధావిని అని పేరు పొందే అవకాశమూ రాలేదు. ప్చ్. :(